నేను అమ్మా, నాన్నల ప్రేమకు రూపాన్ని. బిడ్డలు పుడితే అమ్మ ఆరోగ్యం చెడిపోతుందని , ప్రాణానికే ప్రమాదమని , ఎవరినైనా పెంచుకుందాం, వద్దన్నాడట నాన్న. కానీ అమ్మ పట్టుపట్టి మరీ నన్ను కనడానికి సిద్దమైంది.
నేను పుట్టడం విషయంలో చాలా గందరగోళమే ఉంది తెలుసా. 8వ తారీఖున అమ్మ మామూలుగానే నాయనమ్మతో కలిసి దొంగరాముడు సినిమా చూస్తూ ఉంది ఈలోపు నేను కాస్త హడావుడి చేసి నాయనమ్మను కంగారు పెట్టాను. నాన్నను త్వరగారమ్మని కబురు చేస్తే ఇంటికి వచ్చి కంప్వూటర్ ముందు కూర్చున్నాడట నాన్న.
అమ్మకే కంగారనిపించి హాస్పటల్ కి వెళదామని బయలుదేరారు. అక్కడకి వెళ్ళేసరికి అమ్మకు బీపీ పెరిగి ఒళ్ళు చల్లగా అయిపోయిందట, ఆపరేషన్ మరునాడు ఉదయం చేస్తానన్న సునీతా డాక్టర్ లేదు ఉదయమయితే ప్రమాదం అవుతుంది. ఓ రెండు గంటల్లో చేసేద్దాం అనగానే నాన్న, నాయనమ్మల్లో ఒకటే కంగారు. వెంటనే రక్తం కోసం నాన్న పరుగులు, అమ్మ తనకివే ఆఖరు క్షణాలన్నట్టు నాన్నని అందరికీ అప్పగించడాలు, ఈలోపు రవీ మామయ్య, రెడ్డీ మామయ్య, జయరాం బాబాయి బయలుదేరి వచ్చారట. అమ్మని ఆపరేషన్ దియేటర్ కి తీసుకుపోతున్నారు. ఇంకా నాన్నరాలేదు, అమ్మలో ఒకటే కంగారు చివరగా నాన్నను చూడాలి, తనతో మాట్లాడాలని, కానీ రక్తం కోసం వెళ్ళి ఆలస్యంగా వచ్చాడు నాన్న. అయినా ఇద్దరూ ఓ క్షణం చూసుకున్నారు. అంతే అమ్మ దియేటర్ లోనికి వెళిపోయింది. మత్తు ఇచ్చినా అమ్మ నా రాక గురించే ఎదురుచూస్తూ ఉంది. నేను రావడమే పేద్దగా ఏడుస్తూ వచ్చానట బైటకు. ఏ బిడ్డని అడగడం కంటే ముందు ఆరోగ్యంగా ఉన్నాడా అందట అమ్మ. అంతే అమ్మ నా ఏడుపు ఒక్కటే వింది.నేను చాలా పీలగా ఊపిరి తిత్తులు సరిగా ఏర్పడకుండా పుట్టాను కదా. వేరే హాస్పటల్ కి వెళ్ళి దాదాపు 9రోజులు ఉండిపోయాను. ఇక్కడ అమ్మ నాగురించి బెంగ పెట్టుకుంది. పడుకోదు. ఓ పిచ్చిదానిలా అయిపోయింది. ఈ సమయానికి నా బాబు పాలకోసం ఏడుస్తాడు కదా అంటూ. ఆఖరికి సైకియాట్రిస్ట్ కి కూడా చూపించారట . అమ్మకి కోపం వచ్చి నా బాబూకి ఓ వయసు వచ్చాకా మందులు వాడతా గానీ ఇప్పుడు కాదని చెప్పి పంపేసిందట. ఆ డాక్టర్ వెళుతూ వెళుతూ ఓ క్షణం కూడా ఒంటరిగా వదలద్దని చెప్పి వెళిపోయిందట. అప్పటినుండి అంతా ఒకటే కంగారు పడిపోయారట. రవీ మామయ్య, జయరాం బాబాయి అమ్మకు చాలా ధైర్యం చెప్పారట ఆసమయంలో. అందరికీ పైకి చాలా ధైర్యంగా కనిపించే నాన్న మాత్రం అమ్మ ఏమౌతుందో , ఏలా ఉంటుందో అనే బెంగ , భయంతో ఉన్నాడు. నా కోసం పెద్దగా ఆలోచించలేదు. అమ్మ తరువాతే నేను అన్నాడు. అమ్మ కళ్ళు తెరిచాకా అప్పుడు నేను తండ్రినయ్యాను అనుకున్నాడట. అమ్మ అంటే అంత పిచ్చి ప్రేమ నాన్నకి తెలుసా. బాబు ఎలా ఉంటాడని అమ్మ అడిగితే వాడునాకు గ్రహాతరవాసిలా కనిపించాడు అన్నాడట.
మొత్తానికి నేను ఇంటికి వచ్చాను. నేను క్షేమంగా ఉండాలని అందరి కంటే ఎక్కువగా తాపత్రయ పడింది రవీ మావయ్య. అమ్మకు తోడపుడ్డక పోయినా అంతకన్నా ఎక్కువ. ఇక నుండీ నాకు కూడా. నన్ను చూడాలని చాలా ఆశ పడిన జయరాం బాబాయి ఉద్యోగ ప్రయత్నం కోసం ఊరు వెళ్ళాడు. నాకు ఎలా ఉందోనని కనుక్కునేవాడు.. నా ఆకారం నిజంగానే చిన్నగా తయారైయింది బాగా చిక్కిపోయాను. ఇప్పుడు నా ప్రతి కదలికా ,హావభావాలు, నా నవ్వులు, నా ఏడుపు అన్నీ విడ్డూరమే వీళ్ళకు. అంతా నన్ను తెగ ముద్దు చేస్తున్నారు. నాన్న ఇప్పుడు ఎక్కువ సమయం నాతోనే ఉంటున్నాడు. అన్నట్టు నాకు ఇంకో బాబాయి ఉన్నాడు. పాపం బాబాయి చాలా దూరంలో కదా ఉండేది అందుకే మా పిన్నికి వీసా దొరకలేదట అందుకే చైతన్య బాబాయి మాత్రం చాలా కష్టం మీద 17 తారీఖున రాగలిగాడు. నన్ను చూసి అచ్చం నాన్నలానే ఉన్నాను అన్నాడట.

No comments:
Post a Comment